తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద 218 గ్రాముల ఎండు గంజాయి పట్టివేత !
తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 218 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడింది. గంజాయి చాక్లెట్ల రూపంలో అక్రమంగా తరలిస్తున్న రాహుల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
మెదక్ జిల్లా ఎక్సైజ్ అధికారి నరసింహారెడ్డి ఆదేశాల మేరకు నర్సాపూర్ ఎక్సైజ్ సీఐ కులం ముస్తఫా ఆధ్వర్యంలో తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఎక్సైజ్ సిబ్బంది – అధికారులు కలిసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయి గుర్తించినట్లు తెలిపారు.
పట్టుబడిన గంజాయి మొత్తం 218 గ్రాములుగా అధికారులు గుర్తించారు. గంజాయిని చాక్లెట్ల రూపంలో తరలిస్తున్న రాహుల్ను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు నర్సాపూర్ ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
నిందితుడు రాహుల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరక్పూర్ పరిధి మురిరిగాడ్వా గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గంజాయిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అక్రమంగా గంజాయి తరలింపు – విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు వాహన తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అనుమానాస్పదంగా కనిపించే వాహనాలను తనిఖీ చేస్తూ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ వాహన తనిఖీల్లో జ్ఞానేశ్వర్, ఎస్ఐ శరత్ కుమార్తో పాటు ఎక్సైజ్ సిబ్బంది రవి, రాజశేఖర్, సందీప్, ఫక్రుద్దీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.






