Friday, September 18, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జనరల్

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో అరెస్ట్‌ !

సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్‌ కైలాష్‌ చంద్‌ మంగ్లా అరెస్ట్‌..రూ.230 కోట్ల సరఫరాల్లో రూ.96 కోట్ల నెయ్యి తయారీ ఆరోపణ 
SAI MANIKANTA
September 18, 2026 · 2 hours క్రితం
2 Views 1 Shares
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (నవజ్యోతి ప్రతినిధి):

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరో కీలక వ్యక్తిని అరెస్ట్‌ చేసింది. హైదరాబాద్‌ జోనల్‌ కార్యాలయ అధికారులు సుకృతి ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ కైలాష్‌ చంద్‌ మంగ్లాను సెప్టెంబర్‌ 17న మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)-2002లోని సెక్షన్‌ 19 కింద అరెస్ట్‌ చేశారు. అనంతరం విశాఖపట్నంలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరచగా, న్యాయ కస్టడీకి పంపింది.

టీటీడీకి 2019 నుంచి 2024 మధ్య సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి విలువ సుమారు రూ.230 కోట్లు అని ఈడీ తెలిపింది. ఇందులో సుమారు రూ.96 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని మంగ్లా తయారు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది. ఈ ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఈడీ దర్యాప్తు ప్రకారం.. రిఫైన్డ్‌ పామ్‌ ఆయిల్‌, పామ్‌ కర్నల్‌ ఆయిల్‌, పామోలిన్‌తో పాటు ఎంజీ-90, మోనోగ్లిజరైడ్స్‌, మైవాసెట్‌ సాఫ్ట్‌ 400, ఎసిటిక్‌ యాసిడ్‌ ఎస్టర్‌ వంటి రసాయనాలను ఉపయోగించి కల్తీ నెయ్యి తయారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం దాన్ని ‘అగ్‌మార్క్‌ స్పెషల్‌ గ్రేడ్‌ కౌ గీ’గా టీటీడీకి సరఫరా చేసినట్లు ఈడీ పేర్కొంది.

మంగ్లా కల్తీ పదార్థాలను సమకూర్చడంలో, తన ఫ్యాక్టరీలో కల్తీ నెయ్యి తయారీలో సహకరించడంతో పాటు పలు సంస్థల ద్వారా సరఫరాలను సమన్వయం చేసినట్లు ఈడీ ఆరోపించింది. శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మల్గంగా మిల్క్‌-అగ్రో ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వంటి సంస్థల పేర్లను దర్యాప్తు సంస్థ ప్రస్తావించింది.

నెయ్యి-రిఫైన్డ్‌ పామ్‌ ఆయిల్‌ కొనుగోలు, విక్రయాలకు సంబంధించి తప్పుడు రికార్డులు సృష్టించి, కల్తీ పదార్థాల వాస్తవ వినియోగాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసినట్లు కూడా ఈడీ తెలిపింది. అసలు నెయ్యి తయారీ-సరఫరా జరుగుతున్నట్లుగా చూపించేందుకు ఈ రికార్డులను ఉపయోగించినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపించింది.

తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేపట్టింది. ఎఫ్‌ఐఆర్‌లో నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఉన్నట్లు ఈడీ తెలిపింది.

ఈ కేసులో ఇంతకుముందు భోలే బాబా ఆర్గానిక్‌ డెయిరీ మిల్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌-డైరెక్టర్‌ విపిన్‌ జైన్‌ను కూడా ఈడీ అరెస్ట్‌ చేసింది. టీటీడీకి కల్తీ నెయ్యి తయారీ-మోసపూరిత సరఫరాను సమన్వయం చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా, కేసులో మరిన్ని ఆర్థిక లావాదేవీలు, సరఫరా వ్యవస్థలు, సంబంధిత వ్యక్తులు-సంస్థల పాత్రపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. మంగ్లాపై నమోదైన ఆరోపణలు దర్యాప్తు సంస్థ వెల్లడించినవే కాగా, కేసులో తుది న్యాయ నిర్ణయం వెలువడాల్సి ఉంది.