Saturday, September 19, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
కరీంనగర్

సర్పంచ్‌ – కార్యదర్శి పంచాయతీ!

విభేదాలతో గాడితప్పిన పాలన.. అభివృద్ధి పనులకు బ్రేక్‌ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు.. ఉపాధి హామీ నిధుల మంజూరుకు ఆటంకం కలెక్టర్‌ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని గ్రామస్తుల డిమాండ్‌
SAI MANIKANTA
September 19, 2026 · 5 hours క్రితం
26 Views 2 Shares

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 19 (నవజ్యోతి ప్రతినిధి):

కరీంనగర్‌ మండలం తాహెర్‌కొండాపూర్‌ గ్రామంలో సర్పంచ్‌ ఆకుల గిరి – పంచాయతీ కార్యదర్శి బత్తుల ప్రవళిక మధ్య నెలకొన్న విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరువురి మధ్య ఆధిపత్య పోరుతో గ్రామపంచాయతీ పరిపాలనపై ప్రభావం పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనులకు అవసరమైన తీర్మానాలు సకాలంలో అందకపోవడంతో ఉపాధి హామీ నిధుల మంజూరుకు కూడా ఆటంకం ఏర్పడినట్లు సమాచారం.

కార్యదర్శి సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, తనకు అవసరమైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సర్పంచ్‌ గిరి కలెక్టర్‌ – జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. కార్యదర్శిని బదిలీ చేయాలని వినతిపత్రంలో కోరారు. మరోవైపు సర్పంచ్‌ వేధింపుల కారణంగా తాను విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నానని ఆరోపిస్తూ కార్యదర్శి ప్రవళిక కూడా డీపీవో – ఎంపీడీవోలకు ఫిర్యాదు చేసి బదిలీ కోరినట్లు సమాచారం.

కార్యదర్శి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మూడు రోజుల పాటు విధులకు గైర్హాజరయ్యారని సర్పంచ్‌ ఆరోపించారు. దీనిపై కార్యదర్శి సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ.. సర్పంచ్‌ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు సెలవు పెట్టినట్లు వెల్లడించారు. ఈ ఆరోపణలపై అధికారికంగా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయానికి సర్పంచ్‌ – కార్యదర్శి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువురూ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు చెర్లభూత్కూర్‌ సర్పంచ్‌ కూర నరేశ్‌రెడ్డి జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

గ్రామపంచాయతీకి ఎన్నికైన ప్రజాప్రతినిధి – పరిపాలన బాధ్యతలు నిర్వహించే కార్యదర్శి సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయి. అయితే కొంతకాలంగా కొనసాగుతున్న ఈ వివాదంతో పరిపాలనపై ప్రభావం పడుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాలు, ఉపాధి హామీ నిధుల మంజూరు వంటి అంశాలు నిలిచిపోవడం గ్రామాభివృద్ధిపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.

ఇరువురి మధ్య వివాదంపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినప్పటికీ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని గ్రామస్తులు అంటున్నారు. జిల్లా కలెక్టర్‌ స్పందించి ఇరువురి వాదనలు పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించి, గ్రామపంచాయతీ పరిపాలన సజావుగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇరువురి మధ్య తీవ్రస్థాయికి చేరిన విభేదాలు
అభివృద్ధి తీర్మానాలు – ఉపాధి హామీ నిధులకు ఆటంకం
సమస్యను పరిష్కరించాలని గ్రామస్తుల విజ్ఞప్తి

గమనిక: సర్పంచ్‌ – కార్యదర్శి పరస్పరం చేసిన ఆరోపణలు వారి వాదనలుగా మాత్రమే పేర్కొనబడ్డాయి. వాటిపై అధికారిక విచారణలో వాస్తవాలు తేలాల్సి ఉంది.