Thursday, September 17, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

చెరువును మింగేసిన భూ బకాసురులు!

SAI MANIKANTA
SAI MANIKANTA
September 17, 2026 ప్రత్యేక కథనాలు

48 ఎకరాల నుంచి 35 ఎకరాలకు కుదింపు – పట్టించుకోని అధికారులు

గజ్వేల్, సెప్టెంబర్ 17 (నవజ్యోతి ప్రతినిధి):

గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి ప్రధాన ఆధారమైన నల్లచెరువు ఆక్రమణలకు గురవుతున్నదని
గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్ 269లో సుమారు
48 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ప్రస్తుతం
35 ఎకరాలకు మాత్రమే పరిమితమైనట్లు వారు పేర్కొంటున్నారు.

13 ఎకరాలు ఎటు పోయాయి?
చెరువు విస్తీర్ణం 48 ఎకరాల నుంచి 35 ఎకరాలకు తగ్గిందని గ్రామస్థులు
చెబుతున్నారు. చెరువు చుట్టుపక్కల భూములు ఆక్రమణలకు గురవుతున్నా గ్రామ పంచాయతీ
సిబ్బంది – సంబంధిత అధికారులు స్పందించడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

తగ్గుతున్న భూగర్భ జలాలు
చెరువు చుట్టుపక్కల భూములు ఆక్రమణలకు గురవుతుండటంతో భూగర్భ జలాలు తగ్గుతున్నాయని
రైతులు చెబుతున్నారు. వ్యవసాయ బోరుబావులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో చెరువు పూర్తిస్థాయిలో నిండకపోవడం కూడా ఇబ్బందిగా మారిందన్నారు.

గ్రామానికి కీలకమైన నల్లచెరువు
కొడకండ్లలో బతుకమ్మ – గణపతి – దుర్గామాత విగ్రహాల నిమజ్జనాలను ఈ చెరువులోనే
నిర్వహిస్తారు. చెరువు కట్టపై ఉన్న శివాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

మిషన్ కాకతీయ ప్రతిపాదనలు ఏమయ్యాయి?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయలో భాగంగా చెరువులో పూడికతీత చేపట్టి
మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు చేసినా అవి అమలుకు నోచుకోలేదని
గ్రామస్థులు తెలిపారు.

ఆక్రమణలు తొలగించి పూర్వ వైభవం తీసుకురావాలి
ఆక్రమణలకు గురైన చెరువు భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో పాటు నల్లచెరువును
పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకురావాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.