ఉపరాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు!
సెప్టెంబర్ 17న హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 17న ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్కు చేరుకోనున్నారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్ తెలిపారు.
ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలు, రహదారి ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ సంజయ్ జాజు సూచించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత కార్యదర్శులు – పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, రోడ్లు – భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, డీజీపీ సీవీ ఆనంద్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





