అక్టోబర్ 15 నుంచి యూపీఐకి కొత్త ఛార్జీలు!
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులపై కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధానం 2026 అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. అయితే సాధారణ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే చెల్లింపులు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయి.
రూ.2,000కు మించిన కొన్ని వ్యాపారి చెల్లింపులపై 0.4% ఎండీఆర్ వర్తిస్తుంది. ఈ ఛార్జీ వినియోగదారుడి నుంచి వసూలు చేయకూడదు. వ్యాపార చెల్లింపుల వ్యవస్థలోని సంబంధిత భాగస్వాముల మధ్య ఈ మొత్తాన్ని పంచుతారు.
రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన అర్హత కలిగిన లావాదేవీలకు గరిష్ఠ ఎండీఆర్ రూ.300గా ఉంటుంది.
- వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ చెల్లింపులు ఎంత మొత్తమైనా ఉచితం.
- వ్యాపారులకు రూ.2,000 వరకు చేసే చెల్లింపులపై ఎండీఆర్ ఉండదు.
- స్థానిక దుకాణం లేదా వీధి వ్యాపారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినందుకు వినియోగదారుడిపై ఛార్జీ ఉండదు.
- యూపీఐ యాప్ వినియోగానికి ప్రత్యేక ప్లాట్ఫామ్ రుసుము విధించబోమని FAQలో పేర్కొన్నారు.
| చెల్లింపు | ఎండీఆర్ | వ్యాపారి చెల్లింపు |
|---|---|---|
| రూ.2,000 | 0% | రూ.0 |
| రూ.3,000 | 0.4% | రూ.12 |
| రూ.50,000 | 0.4% | రూ.200 |
| రూ.1,00,000 | గరిష్ఠ పరిమితి | రూ.300 |
నెలకు యూపీఐ క్యూఆర్ ద్వారా రూ.1 లక్ష వరకు స్వీకరించే అర్హత కలిగిన చిన్న వ్యాపారులు పీ2పీఎం విభాగంలో కొనసాగితే సున్నా ఎండీఆర్ ప్రయోజనం పొందుతారు.
రూ.2,000కు మించిన ఒక్క చెల్లింపు వచ్చినంత మాత్రాన చిన్న వ్యాపారికి ఆటోమేటిక్గా ఎండీఆర్ వర్తించదు. వ్యాపారి ఖాతా వర్గీకరణ ఆధారంగానే ఇది నిర్ణయిస్తారు.
కొత్త విధానంతో సుమారు 96 శాతం పీ2ఎం లావాదేవీలు ప్రభావితం కావని FAQలో పేర్కొన్నారు. రూ.2,000 వరకు జరిగే చెల్లింపులు మొత్తం పీ2ఎం లావాదేవీల్లో 95 శాతానికి పైగా ఉన్నట్లు వివరించారు.
ఆగస్టు 2026లో యూపీఐ ద్వారా 2,451 కోట్ల లావాదేవీలు జరిగాయని.. వాటి విలువ సుమారు రూ.29.9 లక్షల కోట్లుగా ఉందని FAQ తెలిపింది.
కొన్ని ప్రత్యేక వ్యాపార విభాగాలకు 0.4 శాతం బదులు లావాదేవీకి రూ.5 చొప్పున ఫ్లాట్ ఎండీఆర్ విధానం ఉంటుంది. బీమా, ఇంధనం, ప్రజా వినియోగ సేవలు వంటి విభాగాల్లో రూ.2,000కు మించిన చెల్లింపులకు ఈ రేటు వర్తిస్తుంది.
రూ.2,000 వరకు ఉన్న అర్హత కలిగిన చెల్లింపులకు మాత్రం ఎండీఆర్ ఉండదు.
మ్యూచువల్ ఫండ్లు, సెక్యూరిటీల కొనుగోలు, నమోదిత స్టాక్ బ్రోకర్లకు సంబంధించిన యూపీఐ చెల్లింపులకు 0.02% ఎండీఆర్, గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుందని FAQలో పేర్కొన్నారు.
అక్టోబర్ 15 నుంచి వచ్చే ఎండీఆర్ వినియోగదారులపై కొత్త యూపీఐ ఛార్జీ కాదు. అర్హత కలిగిన వ్యాపార చెల్లింపులకు వర్తించే వ్యాపారి వైపు రుసుము. వ్యాపారి ఈ రుసుమును వినియోగదారుడిపై అదనంగా వేయకూడదు.





