మక్కా సమీపంలో హౌతీ డ్రోన్ కూల్చివేత!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సౌదీ అరేబియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మక్కా నగరానికి దక్షిణంగా వచ్చిన హౌతీ డ్రోన్ను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమి తెలిపింది.
సౌదీ కూటమి ప్రతినిధి తుర్కీ అల్-మాలికీ ప్రకారం.. మంగళవారం సాయంత్రం డ్రోన్ను గుర్తించి అడ్డుకున్నారు. అది మక్కా పవిత్ర గగనతలంలోకి ప్రవేశించకముందే ధ్వంసం చేసినట్లు తెలిపారు.
మక్కా భద్రత తమకు ‘రెడ్లైన్’ అని అల్-మాలికీ పేర్కొన్నారు. 2017లో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం తర్వాత మక్కాను లక్ష్యంగా చేసుకున్న రెండో ప్రయత్నం ఇదేనని ఆయన అన్నారు.
అయితే మక్కా నగరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను హౌతీ అధికారులు ఖండించారు. తమ సంస్థ మక్కాను లక్ష్యంగా చేసుకుందని చెప్పడం “పూర్తిగా అబద్ధం” అని హౌతీ రాజకీయ విభాగం సభ్యుడు మొహమ్మద్ అల్-ఫరా పేర్కొన్నట్లు హౌతీ నిర్వహించే సాబా వార్తా సంస్థ తెలిపింది.
గత వారం రోజులుగా సౌదీ అరేబియాపై హౌతీలు పలు దాడులు ప్రకటించారు. సోమవారం ఓ వైమానిక స్థావరంపై దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించగా.. ఆ ఘటనలో 13 మంది పౌరులు గాయపడ్డారని సౌదీ నేతృత్వంలోని కూటమి అధికారులు తెలిపారు.
యెమెన్లో తమపై జరుగుతున్న వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నట్లు హౌతీలు చెబుతున్నారు.
సౌదీ అరేబియాలోని ఈస్ట్-వెస్ట్ పైప్లైన్పై జరిగిన దాడి తర్వాత చమురు రవాణాపై ఆందోళనలు పెరిగాయి. సుమారు 1,200 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్లైన్ గల్ఫ్ ప్రాంతంలోని చమురును ఎర్ర సముద్రం వైపు తరలిస్తుంది.
హార్ముజ్ జలసంధిలో నౌకాయానం తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఈ మార్గానికి ప్రాధాన్యం పెరిగింది. పైప్లైన్ సేవలు ఎక్కువకాలం నిలిచిపోతే ప్రపంచ చమురు సరఫరాలో 4 శాతం వరకు ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పైప్లైన్ కార్యకలాపాలు ఎప్పుడు పునఃప్రారంభమవుతాయనే విషయంపై సౌదీ ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. అయితే అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ మాత్రం కొద్ది రోజుల్లో పైప్లైన్ ద్వారా ముడి చమురు ప్రవాహం పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
హౌతీలపై సౌదీ నేతృత్వంలోని కూటమి 2015 నుంచి పోరాడుతోంది. ఇటీవలి సంవత్సరాల్లో కాల్పుల విరమణతో పరిస్థితి కొంత సద్దుమణిగినప్పటికీ.. ఈ నెలలో యెమెన్ ప్రభుత్వ అనుకూల దళాలతో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి.
హార్ముజ్ జలసంధిలో నౌకాయానానికి అంతరాయం కొనసాగుతుండగా.. బాబ్ ఎల్-మందెబ్ ప్రాంతంలో హౌతీల కార్యకలాపాలు పెరగడం సౌదీ చమురు ఎగుమతులపై కొత్త ఆందోళనలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో మక్కా సమీపంలోని డ్రోన్ ఘటన పశ్చిమాసియా సంక్షోభంలో మరో కీలక పరిణామంగా మారింది.





