ఫ్రిజ్ పేలి.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి!
కర్ణాటకలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బెళగావిలోని చావట్ గల్లిలో సోమవారం అర్ధరాత్రి ఫ్రిజ్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులను భారతి దమోనే (50), శారద దమోనే (45), గంగా దమోనే (25), ప్రియా దమోనే (24)గా పోలీసులు గుర్తించారు. గజానన్ దమోనే (65), రోషన్ దమోనే (21) తీవ్రంగా గాయపడ్డారు.
శారద గజానన్ భార్య కాగా.. భారతి ఆయన సోదరి. గంగా, ప్రియా దంపతుల కుమార్తెలు. రోషన్ వారి కుమారుడు.
గణేశ్ చతుర్థి సందర్భంగా ఇంట్లో గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు భోజనం అనంతరం నిద్రించారు. రాత్రి 2.15 గంటల సమయంలో భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
అప్పటికే ఇంటి పక్కన ఉన్న షెడ్లో మంటలు చెలరేగాయి. స్థానికులు గజానన్, రోషన్లను బయటకు తీసుకురాగలిగారు. మిగిలిన నలుగురు మంటల్లో చిక్కుకుని మృతి చెందారు.
ప్రాథమికంగా ఫ్రిజ్ పేలినట్లు స్పష్టమైందని పోలీసులు తెలిపారు. అయితే పేలుడికి అసలు కారణమేంటన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా? లేక ఇతర కారణంతో ఫ్రిజ్ పేలిందా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. గణేశుడి విగ్రహానికి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
గజానన్, రోషన్లకు సుమారు 60 శాతం కాలిన గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి కాంక్రీట్ గోడలు లేని షెడ్ ధ్వంసమైంది. ఇంట్లోని విలువైన వస్తువులు కూడా మంటల్లో కాలిపోయాయి.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రిజ్ పేలుడికి దారితీసిన పరిస్థితులు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ పాత్ర తదితర అంశాలను పరిశీలిస్తున్నారు.





