పిల్లలను ‘రాడికలైజ్’ చేసే సంస్థలపై చర్యలు లేవా?
గుర్తింపు లేకుండా కొనసాగుతున్న కొన్ని విద్యా సంస్థల్లో పిల్లలను మతపరంగా ప్రభావితం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ అంశంపై గతంలో ఇచ్చిన ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదంటూ అశ్విని ఉపాధ్యాయ్ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
14 ఏళ్లలోపు పిల్లలకు లౌకిక విద్య లేదా మతపరమైన బోధనలు అందించే అన్ని సంస్థలను నమోదు, గుర్తింపు, పర్యవేక్షణ – నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలని ఉపాధ్యాయ్ గతంలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
గుర్తింపు లేని సంస్థల్లో పిల్లలను తీవ్రవాద భావజాలం వైపు మళ్లించే పరిస్థితులు ఉన్నాయని ఆయన తన పిటిషన్లో ఆరోపించినట్లు సమాచారం.
ఈ అంశంపై గతంలో దాఖలైన పిటిషన్ను మే 11న సుప్రీంకోర్టు ముగించింది. ఉపాధ్యాయ్ ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రాతినిధ్యాన్ని రెండు నెలల్లో పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
అయితే ఆ ఆదేశాలను ప్రభుత్వం పాటించలేదని ఆరోపిస్తూ ఇప్పుడు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.
మైనారిటీలు విద్యా సంస్థలను ఏర్పాటు చేసి నిర్వహించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 కల్పించే హక్కులపై కూడా ఉపాధ్యాయ్ గత పిటిషన్లో వాదనలు చేశారు.
మతపరమైన విద్యను అందించే సంస్థలకు ఆర్టికల్ 30 కింద ప్రత్యేక హక్కులు ఉండకూడదని, వాటిని మత వ్యవహారాలను నిర్వహించే హక్కుకు సంబంధించిన ఆర్టికల్ 26 పరిధిలో పరిగణించాలని ఆయన కోరారు.
ఇదే అంశంపై మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆగస్టులో సుప్రీంకోర్టు విచారించేందుకు నిరాకరించింది. ఒకే అంశంపై వరుసగా పిటిషన్లు దాఖలు చేయరాదని పేర్కొంటూ.. ఉపాధ్యాయ్ ఆ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.
తాజా విచారణలో ఈ అంశం రాజ్యాంగపరమైన ప్రశ్నలకు సంబంధించినదని ఉపాధ్యాయ్ కోర్టుకు తెలిపారు. అయితే ధిక్కరణ పిటిషన్లో రాజ్యాంగపరమైన అంశాలను పరిశీలించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
“ధిక్కరణలో రాజ్యాంగ అంశాలను పరిశీలించం.. మా ఆదేశాలు అమలయ్యాయా లేదా అన్నదే చూస్తాం” అని కోర్టు పేర్కొంది. ప్రభుత్వం తన వాదన వినిపించిన తర్వాత సంబంధిత అంశాలను ప్రస్తావించాలని సూచించింది.
కేసును సుప్రీంకోర్టు అక్టోబర్ 16కు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం తన ప్రాతినిధ్యంపై తీసుకున్న చర్యలు – మే 11న ఇచ్చిన కోర్టు ఆదేశాల అమలుపై తదుపరి విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.





