రోహిత్ శర్మను దాటేసిన బట్లర్!
ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ – బ్యాటర్ జోస్ బట్లర్ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను అధిగమించి పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు.
శ్రీలంకతో సౌతాంప్టన్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో బట్లర్ కేవలం 44 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇందులో 29 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. హ్యారీ బ్రూక్తో కలిసి రెండో వికెట్కు 128 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఈ ఇన్నింగ్స్తో బట్లర్ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 161 మ్యాచ్ల్లో 4,292 పరుగులకు చేరుకున్నాడు. అతని ఖాతాలో 2 సెంచరీలు – 29 అర్ధసెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ 4,231 పరుగులతో మూడో స్థానానికి వెళ్లాడు.
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు ఇప్పటికీ పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ పేరిట ఉంది. 145 మ్యాచ్ల్లో 4,596 పరుగులు చేసిన బాబర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
బట్లర్ – బ్రూక్ దూకుడుతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 254/4 భారీ స్కోరు సాధించింది. హ్యారీ బ్రూక్ అజేయంగా 114 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో శ్రీలంక 19 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ 119 పరుగుల భారీ విజయం సాధించింది.
టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో శ్రీలంకపై ఇంగ్లండ్ వరుస విజయాల సంఖ్య 13కు చేరింది. ఈ మ్యాచ్లో కెరీర్లోనే అత్యుత్తమ టీ20 అంతర్జాతీయ స్కోరు సాధించిన హ్యారీ బ్రూక్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ ఈ నెల ప్రారంభంలో జట్టుతో ప్రత్యేక మార్గదర్శకుడిగా చేరాడు. 2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ వరకు ఆయన ఈ బాధ్యతలో కొనసాగనున్నాడు.





