గంజాయి నిందితులపై పీడీ యాక్ట్!
గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులపై కామారెడ్డి పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. భారీ మొత్తంలో గంజాయి తరలిస్తూ పట్టుబడిన నిందితులపై ప్రజా శాంతి – భద్రతల పరిరక్షణలో భాగంగా నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
జూన్ 20న ఒడిశా నుంచి మహారాష్ట్రలోని నాసిక్కు భారీగా గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు జాతీయ రహదారి-44పై తనిఖీలు చేపట్టాయి.
క్యాసంపల్లి శివారులోని రాయల్ ధాబా సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనాన్ని తనిఖీ చేయగా.. పనసపండ్ల కింద దాచిన 387.128 కిలోల గంజాయి బయటపడింది.
పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.1,93,56,400 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో అప్పట్లోనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పీడీ యాక్ట్ కింద నిర్బంధించిన వారిని ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లాకు చెందిన రాజు అలియాస్ రాజ్ కిషోర్ ప్రధాన్, దీపక్ అలియాస్ దీపక్ ప్రధాన్గా పోలీసులు గుర్తించారు.
గంజాయి అక్రమ సరఫరా ద్వారా యువతపై తీవ్ర ప్రభావం చూపే నేరాలకు పాల్పడుతున్నందున.. ప్రజా శాంతి – భద్రతల పరిరక్షణ కోసం పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
“మాదకద్రవ్యాల అక్రమ రవాణా యువత భవిష్యత్తును నాశనం చేస్తుంది. గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా – వాహన తనిఖీలు కొనసాగుతున్నాయి” అని ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు.
అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ను కచ్చితంగా అమలు చేస్తామని హెచ్చరించారు.
జిల్లాలో గంజాయి అక్రమ రవాణా లేదా విక్రయాలపై సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.





