ఒక్క రూపాయి వేలం ఉన్న పరిశీలించాల్సిందే !
రక్షణ రంగంలో టెండర్ల ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యంత తక్కువ ధరను కోట్ చేసిన సంస్థకే యాంత్రికంగా కాంట్రాక్ట్ అప్పగించరాదని స్పష్టం చేసింది. బిడ్ విలువ అసాధారణంగా తక్కువగా ఉండి.. ఆ సంస్థ ప్రాజెక్టును పూర్తి చేయగల సామర్థ్యంపై సందేహాలు తలెత్తితే ముందుగా సాధ్యాసాధ్యతల పరిశీలన నిర్వహించాలని ఆదేశించింది.
రక్షణ రంగంలో గతంలో కొన్ని డీసీపీపీ పోటీల్లో అత్యంత తక్కువ ధరలతో బిడ్లు దాఖలైన సందర్భాలు ఉన్నాయి. ఒక సందర్భంలో ప్రోటోటైప్ల అభివృద్ధికి కేవలం రూ.1 బిడ్ దాఖలైనట్లు కోర్టు దృష్టికి వచ్చింది.
ప్రారంభ దశలో ప్రోటోటైప్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. ఇంజినీరింగ్, పరీక్షలు, ధ్రువీకరణ వంటి ఖర్చులు భారీగా ఉంటాయి. భవిష్యత్లో పెద్ద ఉత్పత్తి ఆర్డర్లు వస్తాయన్న అంచనాతో సంస్థలు ప్రారంభ దశలో తక్కువ ధరకు లేదా నష్టంతో పనిచేసే అవకాశం ఉందని కోర్టు పరిశీలించింది.
అసాధారణంగా తక్కువ ధరతో వచ్చిన బిడ్ను కేవలం ‘ఎల్-1’ లేదా అతి తక్కువ బిడ్ అనే కారణంతో ఆమోదించకూడదని న్యాయస్థానం పేర్కొంది.
సంస్థ పేర్కొన్న ధరతో ప్రాజెక్టును వాస్తవంగా పూర్తి చేయగలదా? అవసరమైన ముడిసరుకు – తయారీ ఖర్చులను భరించగలదా? వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కాంట్రాక్ట్పై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
డీఆర్డీవోకు చెందిన డెవలప్మెంట్-కమ్-ప్రొడక్షన్ పార్ట్నర్షిప్ (డీసీపీపీ) విధానంలో భాగంగా చేపట్టిన ‘ప్రాసెసర్ ఆధారిత మూర్డ్ మైన్–నెక్స్ట్ జనరేషన్’ అభివృద్ధి ప్రాజెక్టుపై ఈ వివాదం ఏర్పడింది.
ఈ ప్రాజెక్టులో జేకే ఎంటర్ప్రైజెస్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. కాంట్రాక్ట్ విజేత అపోలో మైక్రో సిస్టమ్స్ సమర్పించిన బిడ్ ప్రాథమికంగా అవసరమైన ముడిసరుకు ఖర్చును కూడా భరించలేనంత తక్కువగా ఉందని పిటిషనర్ వాదించింది.
అసాధారణంగా తక్కువ బిడ్పై కాంట్రాక్ట్ ఇచ్చే ముందు నిర్వహించాల్సిన ప్రీ-అవార్డ్ పరిశీలన జరగలేదని హైకోర్టు గుర్తించింది.
డీఆర్డీవో ప్రొక్యూర్మెంట్ మాన్యువల్–2025 ప్రకారం అవసరమైన పరిశీలన నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అన్ని నిబంధనలు నెరవేరినట్లు నిర్ధారించిన తర్వాతే కాంట్రాక్ట్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేసింది.
ఈ తీర్పు రక్షణ రంగంలో అత్యల్ప ధరల బిడ్ల పరిశీలనకు ప్రాధాన్యం పెంచే అవకాశం ఉంది. తక్కువ ధర ఒక్కటే అర్హత కాదని.. బిడ్ ఆచరణ సాధ్యమా, సంస్థకు అవసరమైన సాంకేతిక – ఆర్థిక సామర్థ్యం ఉందా అనే అంశాలను కూడా పరిశీలించాల్సిన అవసరాన్ని ఈ తీర్పు స్పష్టం చేసింది.





