ధ్రువీకరణల ప్రపంచంలోనూ బ్రిక్స్ ఏకాభిప్రాయం సాధించింది!
తీవ్రంగా విభజితమైన అంతర్జాతీయ పరిస్థితుల మధ్య భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సులో ఏకాభిప్రాయాన్ని సాధించామని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. భారత్ నిర్వహించిన ఈ సదస్సు విజయవంతమైందని పేర్కొన్నారు.
ప్రపంచం ప్రస్తుతం తీవ్ర ధ్రువీకరణలను ఎదుర్కొంటున్నప్పటికీ.. బ్రిక్స్ దేశాలు కీలక అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగాయని జైశంకర్ అన్నారు.
ముఖ్యంగా పశ్చిమాసియా ఘర్షణ అత్యంత క్లిష్టమైన అంశంగా ఉన్నప్పటికీ.. అందరూ అంగీకరించే ప్రకటనను తీసుకురావడం సదస్సు విజయాల్లో ఒకటని చెప్పారు.
బ్రిక్స్ ప్రకటనలో శాంతి, భద్రత, స్థిరత్వం, దీర్ఘకాలిక అవగాహన అవసరాన్ని ప్రస్తావించినట్లు జైశంకర్ తెలిపారు.
ప్రపంచ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలు, ఇంధన ప్రవాహం సజావుగా కొనసాగాలని.. పౌరులు – పౌర మౌలిక వసతులకు రక్షణ కల్పించాలన్న సందేశం కూడా ఇచ్చినట్లు వివరించారు.
సదస్సు సందర్భంగా వివిధ దేశాల నేతలు పరస్పరం సమావేశమై బహిరంగంగా – సౌకర్యవంతంగా చర్చలు జరిపారని జైశంకర్ చెప్పారు.
సాధారణ పరిస్థితుల్లో కలిసే అవకాశం తక్కువగా ఉన్న కొందరు నేతలు కూడా ఈ వేదికపై కలుసుకున్నారని.. ఇది అంతర్జాతీయ చర్చలకు దోహదపడిందని పేర్కొన్నారు.
సదస్సుకు 32 ప్రతినిధి బృందాలు హాజరయ్యాయని జైశంకర్ తెలిపారు. వీటిలో 11 బ్రిక్స్ సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాలు, నాలుగు ప్రాంతీయ సంస్థలు, ఏడు అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయని చెప్పారు.
రష్యా, చైనా, ఇరాన్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఈజిప్ట్ అధ్యక్షులతో పాటు అబుదాబి యువరాజు – ఇథియోపియా ప్రధానమంత్రి కూడా పాల్గొన్నారని తెలిపారు.
సదస్సు ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, సాంకేతికతపై దృష్టి పెట్టిందని జైశంకర్ చెప్పారు. గ్లోబల్ సౌత్ ప్రయోజనాల కోసం గళం వినిపించడమే ప్రధాన సందేశంగా నిలిచిందన్నారు.
సంస్కరణలు – ప్రతిఘటన సామర్థ్యం అనే అంశాలు సభ్య దేశాలను ఏకం చేశాయని వివరించారు.
ఉగ్రవాదంపై కూడా బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయం కనిపించిందని జైశంకర్ తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నేరమేనని స్పష్టమైన సందేశం ఇచ్చారని చెప్పారు.
2025 ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని బ్రిక్స్ తీవ్రంగా ఖండించిందని, సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవసరమని పేర్కొన్నారు.
“చాలామంది ఈ సదస్సు జరగదని అన్నారు. కానీ అది జరిగింది. న్యూఢిల్లీలో జరిగింది.. ప్రధాని మోదీ నాయకత్వంలో జరిగింది” అని జైశంకర్ పేర్కొన్నారు.





