Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

వైభవ్‌ కోసం మ్యాచ్‌ చూసిన శ్రీకాంత్‌!

September 5, 2026 జనరల్

వైభవ్‌ సూర్యవంశీ.. ఈ పేరు వినిపిస్తే చాలు క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఐపీఎల్‌లో తన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 15 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లోనూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. వైభవ్‌ బ్యాటింగ్‌ను చూసేందుకు దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లను సైతం ఆసక్తిగా వీక్షిస్తున్నారని భారత మాజీ కెప్టెన్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ పేర్కొన్నారు.
తన యూట్యూబ్‌ కార్యక్రమంలో శ్రీకాంత్‌ మాట్లాడుతూ దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్‌లో వైభవ్‌ బ్యాటింగ్‌ను చూసేందుకు తాను, తన భార్య ప్రత్యేకంగా మ్యాచ్‌ చూశామని, వైభవ్‌కు ప్రస్తుతం ఉన్న క్రేజ్‌కు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. దేశవాళీ మ్యాచ్‌ అయినప్పటికీ వైభవ్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడనే కారణంతో చాలామంది మ్యాచ్‌ను వీక్షించారని చెప్పారు.
ఈస్ట్‌ జోన్‌, సెంట్రల్‌ జోన్‌ మధ్య జరిగిన సెమీఫైనల్‌లో వైభవ్‌ తన బ్యాటింగ్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. కేవలం 81 బంతుల్లోనే 92 పరుగులు సాధించాడు. ఏడు సిక్సర్లు, ఏడు ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే సెంచరీకి చేరువగా వచ్చిన సమయంలో ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 42 పరుగులు సాధించాడు. అతని ప్రదర్శనతో పాటు జట్టు సమష్టి ఆటతీరుతో ఈస్ట్‌ జోన్‌ 14 ఏళ్ల తర్వాత తొలిసారి దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. 90ల్లోనే ఆగిపోతున్నాడు! వైభవ్‌ తరచూ సెంచరీకి చేరువగా వచ్చి ఆగిపోతుండటంపై శ్రీకాంత్‌ సరదాగా స్పందించాడు. ‘‘మళ్లీ సెంచరీ మిస్‌ చేశావు. నాకంటే ఎక్కువగా 90ల్లో ఔటవుతున్నావు’’ అంటూ చమత్కరించాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో వైభవ్‌ 93, 97, 96 పరుగుల వద్ద ఔటయ్యాడు. తాజాగా దులీప్‌ ట్రోఫీలోనూ 92 పరుగులు చేసి సెంచరీని చేజార్చుకోవడంతో ఈ గణాంకాలను శ్రీకాంత్‌ సరదాగా ప్రస్తావించాడు.
వైభవ్‌ బ్యాటింగ్‌ శైలిని శ్రీకాంత్‌ ప్రత్యేకంగా ప్రశంసించాడు. వయసుకు మించి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నాడని, మీడియం పేసర్లను కూడా ఏమాత్రం భయపడకుండా ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నాడు. తన బ్యాటింగ్‌లో మరింత మెరుగుదల సాధిస్తే వైభవ్‌ మరో స్థాయికి చేరుకునే అవకాశం.