Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

స్మృతి మంధానకు అరుదైన రికార్డు!

September 5, 2026 జనరల్

మహిళల టీ20 ఆసియా కప్‌లో అసలైన సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ జట్లు శనివారం దుబాయ్‌ వేదికగా తలపడనున్నాయి. ఈ హైఓల్టేజ్‌ పోరుపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొన్న వేళ.. టీమిండియా స్టార్‌ ఓపెనర్‌, వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధానను మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది.
‘లేడీ విరాట్‌ కోహ్లీ’గా అభిమానుల నుంచి గుర్తింపు తెచ్చుకున్న మంధాన ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో ఘనతలు సాధించింది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ప్రత్యేక రికార్డు సృష్టించిన ఆమె.. ఇప్పుడు మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో మరో చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.
మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రస్తుతం న్యూజిలాండ్‌ దిగ్గజం సుజీ బేట్స్‌ అగ్రస్థానంలో ఉంది. ఆమె ఖాతాలో 4,758 పరుగులు ఉన్నాయి. స్మృతి మంధాన ఇప్పటివరకు 167 మ్యాచ్‌ల్లో 30.79 సగటుతో 4,681 పరుగులు సాధించింది. దీంతో బేట్స్‌ రికార్డును అధిగమించాలంటే మంధానకు మరో 78 పరుగులు మాత్రమే అవసరం.
భారత్‌–పాకిస్థాన్‌ మ్యాచ్‌లో మంధాన 78 పరుగులు సాధిస్తే.. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సుజీ బేట్స్‌ను అధిగమిస్తుంది. దీంతో ఈ చిరకాల ప్రత్యర్థుల పోరు మంధానకు వ్యక్తిగతంగా కూడా ఎంతో ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది.
ప్రస్తుత ఆసియా కప్‌లో మంధాన ఇప్పటికే మంచి ఫామ్‌లో ఉంది. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో 124 పరుగుల భారీ శతకం సాధించింది. టోర్నీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లోనే 143 పరుగులు చేయడం ద్వారా తన జోరును చాటుకుంది. ఇదే ఫామ్‌ను పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ కొనసాగిస్తే అరుదైన రికార్డు ఆమె సొంతమయ్యే అవకాశాలు ఉన్నాయి.