Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

మోటమర్రిలో గోదాం ప్రారంభం.. రోడ్లకు శంకుస్థాపన

LAXMAN MANNE
LAXMAN MANNE
August 30, 2026 తెలంగాణ

ఖమ్మం, ఆగస్టు 30 : బోనకల్ మండలం మోటమర్రి గ్రామంలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్‌సీడీసీ పథకం కింద పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన గోదామును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. రూ.24.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ గోదాం 300 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో రైతులకు ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా గోదాం భవనాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. పంటలను సురక్షితంగా నిల్వ చేసుకునే అవకాశంతో రైతులు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా విక్రయాలు చేసుకునే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.
అనంతరం మోటమర్రి ఎస్సీ కాలనీలో రూ.1 కోటి వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. కాలనీలో రహదారుల సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.
రైతుల సంక్షేమం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూరుస్తోందని చెప్పారు. సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ రైతులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. మోటమర్రి గ్రామంలో చేపట్టిన ఈ అభివృద్ధి పనులు స్థానిక ప్రజలకు, రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గ్రామీణ మౌలిక వసతుల విస్తరణ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.